
పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.
ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.
రెండు పాన్ కార్డులున్నా తప్పే..
ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది.