యూపీఐ (UPI) లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు చెల్లింపులు చేసే వారికి కూడా చార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి క్యాపిటల్ మార్కెట్ కేటగిరీలోని యూపీఐ చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 ఉంటుంది.
ఇన్వెస్టర్లపై నేరుగా నో ఎఫెక్ట్!
కొత్త విధానంలో ఈ ఎండీఆర్ను రిటైల్ ఇన్వెస్టర్పై నేరుగా మోపడం కాకుండా, క్యాపిటల్ మార్కెట్ పరిధిలోని నియంత్రిత సంస్థలైన బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, డీలర్లు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లు భరించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఈక్విటీ కొనుగోళ్లు, డెట్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లు, బ్రోకర్ అకౌంట్ లేదా వాలెట్కు నిధుల జమ వంటి యూపీఐ చెల్లింపులు ఉంటాయి.
అందువల్ల సాధారణ దీర్ఘకాలిక మదుపరులకు తక్షణంగా అదనపు ఛార్జీ పడే అవకాశం పరిమితంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సిప్ల వంటి లావాదేవీల్లో ప్రభావం తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయా సంస్థలు భవిష్యత్తులో తమ ఫీజు నిర్మాణాన్ని మార్చుతాయేమోనన్న ఆందోళనైతే ఉంది.
రూ.1 లక్ష చెల్లిస్తే ఎంత?
0.02 శాతం ఎండీఆర్ అంటే ప్రతి రూ.1 లక్ష క్యాపిటల్ మార్కెట్ యూపీఐ చెల్లింపుపై రూ.20 ఖర్చవుతుంది. రూ.5 లక్షల లావాదేవీకి లెక్క ప్రకారం రూ.100 అవుతుంది. అయితే రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినా గరిష్ఠ ఎండీఆర్ రూ.300కే పరిమితం అవుతుంది.
ఇది సాధారణ మర్చంట్ యూపీఐ చెల్లింపులపై అమలయ్యే 0.4 శాతం రేటుతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వర్తిస్తుంది. మరోవైపు వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్లపై ప్రభావం?
దీర్ఘకాలిక మదుపరులతో పోలిస్తే తరచూ ట్రేడింగ్ చేసే యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్ల విషయంలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజులో అనేకసార్లు యూపీఐ ద్వారా ట్రేడింగ్ అకౌంట్లోకి నిధులు జమ చేసే సందర్భాల్లో బ్రోకర్లకు ప్రతి లావాదేవీపై ఈ ఖర్చు ఏర్పడుతుంది.
డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. వీరు సాధారణంగా తక్కువ మార్జిన్లతో పనిచేస్తుండటంతో, అదనపు చెల్లింపు వ్యయం కొంత మేర లాభదాయకతపై ఒత్తిడి తేవచ్చు. దీనికి ప్రతిగా బ్రోకర్లు నెట్ బ్యాంకింగ్, NEFT/RTGS వర్చువల్ అకౌంట్లు, యూపీఐ బ్లాక్ మెకానిజం వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది.
అన్ని పెట్టుబడులపైనా ఒకే ప్రభావం ఉండదు
కొత్త ఎండీఆర్ ప్రభావం పెట్టుబడి సాధనం, లావాదేవీ పరిమాణం, సంబంధిత బ్రోకర్ లేదా ఏంఎంసీ ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర సెక్యూరిటీల లావాదేవీలపై ప్రభావం ఒకే విధంగా ఉండకపోవచ్చు.
ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఆర్బీఐ ఏమన్నదంటే?


