
ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ లాభాల బాటలోనే ప్రయాణించవు. ఎగుడుదిగుళ్లు సర్వసాధారణం. ర్యాలీ తర్వాత స్టాక్స్లో దిద్దుబాటు సహజం. కనుక ఇన్వెస్టర్లు అన్ని కాలాలకూ అనుకూలమైన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అందుకు వ్యాల్యూ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుంది. గత మూడు నెలల్లో లార్జ్క్యాప్తో పోల్చితే మిడ్, స్మాల్క్యాప్ స్టాక్స్లో భారీ దిద్దుబాటు చూశాం. వ్యాల్యూ ఫండ్స్ ఆకర్షణీయమైన విలువల వద్ద ఉన్న కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి.
తద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని తెచ్చిపెట్టే పనితీరు చూపిస్తాయి. గ్రోత్ స్టాక్స్ మాదిరి వ్యాల్యూ స్టాక్స్ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్ సైతం మంచి రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కనీసం ఏడేళ్లు అంతకు మించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు వ్యాల్యూ ఫండ్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు.
రాబడులు
ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 4.54 శాతంగా ఉన్నాయి. కరెక్షన్ కారణంగా రాబడి తక్కువగా కనిపిస్తోంది. మూడేళ్లలో చూస్తే వార్షికంగా 20.55 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 26.38 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 15 శాతానికిపైనే వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి.
పెట్టుబడుల విధానం
అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించే వాటిని వ్యాల్యూ స్టాక్స్గా చెబుతారు. బీఎస్ఈ సెన్సెక్స్ పీఈ కంటే తక్కువ పీఈ రేషియోలో ట్రేడ్ అవుతున్న (గత 12 నెలల ట్రెయిలింగ్ పీఈ రేషియో) స్టాక్స్ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్కే కేటాయిస్తుంటుంది.
ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటుంది.
పోర్ట్ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.8,004 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 94 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్లోనే 46 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్ఫోలియోలోని స్టాక్స్ సగటు పీఈ రేషియో 12.68 శాతంగా ఉంది.
ఈక్విటీ పెట్టుబడులను గమనించినట్టయితే 68 శాతం లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్క్యాప్ స్టాక్స్లో 24.57 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 7.68 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అత్యధికంగా 39.48 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 12.65 శాతం ఇన్వెస్ట్ చేసింది. టెక్నాలజీ కంపెనీలకు 11 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీలకు 9.57 శాతం చొప్పున కేటాయించింది.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడులు శాతం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.22
బీపీసీఎల్ 4.87
కోల్ ఇండియా 4.79
కోటక్ బ్యాంక్ 4.18
ముత్తూట్ ఫైనాన్స్ 3.94
రాడికో ఖైతాన్ 3.82
ఐసీఐసీఐ బ్యాంక్ 3.79
విప్రో 3.60
శ్రీరామ్ ఫైనాన్స్ 3.47
ఎన్టీపీసీ 3.36