ఏయే పథకాలకు డిమాండ్‌ ఉందంటే.. | Strong Economy Boosts Life Insurance Growth LIC CEO Doraiswamy | Sakshi
Sakshi News home page

ఏయే పథకాలకు డిమాండ్‌ ఉందంటే..

Sep 2 2026 8:38 AM | Updated on Sep 2 2026 8:37 AM

Strong Economy Boosts Life Insurance Growth LIC CEO Doraiswamy

ఆర్థిక ప్రగతి, ఆదాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీమా వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ప్రొటెక్షన్, సేవింగ్స్, రిటైర్మెంట్‌ పథకాలకు డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఇవే ఎల్‌ఐసీ తదుపరి దశ వృద్ధి అధ్యాయాన్ని లిఖిస్తాయని కంపెనీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన తెలిపారు. పార్లమెంటు చట్టం ద్వారా 1956 సెప్టెంబర్‌ 1న ఎల్‌ఐసీ ఏర్పాటైంది. 70 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఘనత ఉన్నంత మాత్రాన సవాళ్లు లేకుండా పోవని దొరైస్వామి పేర్కొన్నారు.

ప్రజలకు నేడు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, టెక్నాలజీ కారణంగా ఆకాంక్షల్లోనూ మార్పులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా యువ కస్టమర్లు.. బీమా అనేది సరళతరమైనదిగా, తమ తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, తక్షణం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా తనను తాను మల్చుకునేందుకు ఎల్‌ఐసీ కృషి చేస్తోందని .. ప్రోడక్ట్‌ పోర్ట్‌ఫోలియోని, టెక్నాలజీని, పంపిణీ విధానాలను మెరుగుపర్చుకుంటోందని చెప్పారు.  

రూ. 5 కోట్లతో ప్రారంభమై..

ఏడు దశాబ్దాల క్రితం రూ. 5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు ఆర్థిక దిగ్గజంగా ఎదిగిందని దొరైస్వామి చెప్పారు. ఈ విజయాన్ని రూపాయల్లో కొలవలేమని, దీనికి ప్రజల నమ్మకమే సరైన కొలమానమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఒడిదుడుకులు పెరుగుతున్న తరుణంలో పాలసీదారులకు పోటీ సంస్థలతో పోలిస్తే దీటైన ప్రయోజనాలు అందించేలా తమ ఫండ్స్‌పై రాబడులను పెంచుకునేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నట్లు దొరైస్వామి వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం ర. 5,35,984 కోట్లకు చేరగా, లాభం రికార్డు స్థాయిలో రూ. 57,419 కోట్లకు ఎగియడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.  

రెండు కొత్త పథకాలు ..

70వ వార్షికోత్సవం సందర్భంగా దొరైస్వామి రెండు కొత్త పథకాలను ఆవిష్కరించారు. బీమా ప్లాటినం, జీవన్‌ రక్షా పాలసీలు వీటిలో ఉన్నాయి. బీమా ప్లాటినం అనేది పొదుపు, ప్రొటెక్షన్‌ మేళవింపుగా ఉంటుంది. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్‌. వార్షికంగా చెల్లించే ప్రతి రూ. 1,000కి రూ. 70 జతవుతుంది. ప్రస్తుత ఎల్‌ఐసీ పాలసీదారులు, మరణించిన పాలసీదారుల నామినీలు/లబ్ధిదారులకు రిబేటు లభిస్తుంది. ఇక జీవన్‌ రక్ష అనేది ప్యూర్‌ రిస్క్‌ ప్లాన్‌గా ఉంటుంది. కనిష్ట, గరిష్ట సమ్‌ అష్యూర్డ్‌లు వరుసగా రూ.5 లక్షలు, రూ.24 లక్షలుగా ఉంటాయి.

ఇదీ చదవండి: బెర్త్ బుక్‌ చేసినా.. పడుకోకూడదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement