
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:06 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 24,747కు చేరింది. సెన్సెక్స్(Sensex) 406 ప్లాయింట్లు ఎగబాకి 81,408 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.32 శాతం పుంజుకుంది.
ప్రధానంగా బ్లూచిప్ కౌంటర్లలో నిన్నటి మార్కెట్లో కొనుగోళ్ల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అంచనాలను మించిన యూఎస్ ఉపాధి గణాంకాలకుతోడు టారిఫ్లపై యూఎస్, చైనా వాణిజ్య చర్చలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిన్నటి మార్కెట్లో ఎన్ఎస్ఈలో మెటల్, ఆయిల్ రంగాలు 0.6 శాతం పుంజుకోగా.. రియల్టీ 0.7 శాతం నీరసించింది.
రూపాయి నేలచూపు
దేశీ కరెన్సీ రెండో రోజు డీలా పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 26 పైసలు క్షీణించి 85.87 వద్ద నిలిచింది. రూపాయి 85.69 వద్ద ప్రారంభమై 86.05 వరకూ పతనమైంది. మంగళవారం సైతం రూపాయి 22 పైసలు కోల్పోయి 85.61 వద్ద ముగిసిన విషయం విదితమే. వెరసి రెండు రోజుల్లో 48 పైసలు నష్టపోయింది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99.11కు చేరింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)