ఏఐ బూమ్‌తో శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌ | Samsung Historic 26.5B AI Driven Bonus For Chip Workers, With Employees Set To Earn Up To ₹3.25 Crore Each | Sakshi
Sakshi News home page

ఏఐ బూమ్‌తో శామ్‌సంగ్‌ బంపర్‌ ఆఫర్‌

May 27 2026 1:40 PM | Updated on May 27 2026 1:49 PM

Samsung Historic 26 5B AI Bonus Chip Workers Get RS 3 25 crore each

కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్‌కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్‌సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.

ఎవరు అర్హులు?

ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్‌సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.

ఈ ఏడాది మార్చిలో శామ్‌సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.

కేవలం బోనస్‌ల కోసమే 26.5 బిలియన్‌ డాలర్లు

శామ్‌సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్‌ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.

ఓటింగ్‌లో భారీ మెజారిటీ

యూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్‌లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.

తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం

ఈ ఒప్పందం కేవలం శామ్‌సంగ్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్‌సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement
 
Advertisement
Advertisement