రాష్ట్రాలకు ఇంతకాలంగా అందిస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లను నిలిపివేయాలంటూ 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపించదని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి వి.ఉల్నమ్ స్పష్టం చేశారు. కేవలం కొన్ని రాష్ట్రాలే ప్రస్తుతం ఈ గ్రాంట్ను అందుకుంటున్నాయంటూ, 2025–26లో రూ.13,000 కోట్లకు తగ్గిపోయినట్టు చెప్పారు.
వాస్తవానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇది 2025–26తో నిలిచిపోవాలన్నారు. రెవెన్యూలోటు గ్రాంట్ను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలని 15వ ఆర్థిక సంఘం సూచించినట్టు గుర్తు చేస్తూ ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.13 వేల కోట్లకు పరిమితం అవుతున్నట్టు చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు కేంద్రం పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు వాటా కింద పంపిణీ చేయాలంటూ అరవింద్ పనగరియా అధ్యక్షతన గల 16వ ఆర్థిక సంఘం సూచించడం తెలిసిందే.
వికేంద్రీకరణ అనంతరం రెవెన్యూ లోటు గ్రాంట్లను ఎత్తివేసి, స్థానిక సంస్థలకు అందించే నిధులను రెట్టింపు చేయాలని సిఫారసు చేసింది.ఆర్థిక సంఘం వికేంద్రీకరణ సూత్రం ప్రకారం రాష్ట్రాల పన్నుల వాటా రూ.14 లక్షల కోట్లుగా ఉంటుందని ఉల్నమ్ తెలిపారు. గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు


