ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం | Online Gaming Bill Clears Parliament Amid Huge Protests By Opposition | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

Aug 21 2025 4:12 PM | Updated on Aug 21 2025 4:39 PM

Online Gaming Bill Clears Parliament Amid Huge Protests By Opposition

ఆన్‌లైన్‌ రియల్ మనీ గేమింగ్‌ను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం ఆమోదం తెలిపింది.  ఓ వైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లో ఎలాంటి చర్చలేకుండానే ఈ బిల్లు  పార్లమెంట్‌ ఆమోదం పొందింది. 

నిన్నటి పార్లమెంట్‌ సెషన్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ సోషల్ గేమింగ్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.

ఏమిటీ బిల్లు?  

  •    అన్ని రకాల ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్‌ గేమ్స్‌)తోపాటు ఆన్‌లైన్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్‌ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది.  

  •    ఆన్‌లైన్‌ గేమ్‌లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్‌ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు.  

  •    ఆన్‌లైన్‌ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్‌ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.

  •    నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్‌)పై ఆధారపడిన ఏ గేమ్‌ అయినా నిషిద్ధమే.  

  •    మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్‌లను నిర్వహించినా దోషులే అవుతారు.  

  •    ఈ బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు.  

  •    డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్‌ గేమ్స్, సోషల్‌ గేమ్స్‌కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది.  

  •    సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్‌ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  

  •    డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్‌ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్‌లైన్‌ సోషల్‌ గేమ్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి.  

  •    ఈ–స్పోర్ట్స్‌కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.  

  •    మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్‌ గేమ్స్‌ ఆడుకోవచ్చు.  

  •    ఆన్‌లైన్‌ గేమ్‌లను వర్గీకరించడానికి, రిజిస్టర్‌ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్‌ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement