మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత | Nationwide Mobile Alert Test India Trials Sachet Disaster Warning System | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత

May 2 2026 12:32 PM | Updated on May 2 2026 1:00 PM

Nationwide Mobile Alert Test India Trials Sachet Disaster Warning System

కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్‌కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్‌ మెసేజ్‌ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

అసలేం జరుగుతోంది?

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్‌)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్‌ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..

  • భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.

  • విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.

  • మొబైల్ డేటా లేకపోయినా, నెట్‌వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్‌ను చేరుతుంది.

అందరి రక్షణే లక్ష్యంగా..

ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement