ఎలక్ట్రానిక్స్‌ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!  | India EMS Market Set To Triple To 150 Billion dollars By FY30 | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్స్‌ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు! 

Jun 9 2026 1:07 AM | Updated on Jun 9 2026 1:07 AM

India EMS Market Set To Triple To 150 Billion dollars By FY30

2030 నాటికి అంచనా 

మూడు రెట్లు పెరగనున్న ఈఎంఎస్‌ మార్కెట్‌ 

విడిభాగాలు, డిజైన్, ఐపీపై దృష్టి సారించాలి 

కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా 

ముంబై: ఎల్రక్టానిక్స్‌ తయారీ సేవల (ఈఎంఎస్‌) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్‌ మార్కెట్‌ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్‌కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్‌ వన్‌ విధానం) ఈ మార్కెట్‌ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 

2025లో ఈఎంఎస్‌ మార్కెట్‌ పరిమాణం 40–45 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్‌తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్‌ తయారీ కేంద్రంగా భారత్‌ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.  

వృద్ధికి అపార అవకాశాలు.. 
అంతర్జాతీయ ఈఎంఎస్‌ మార్కెట్‌ 2025లో 640–650 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్‌సోర్సింగ్‌ ఈ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.  

ఈ చర్యలు అవసరం.. 
ఎలక్ట్రానిక్స్‌ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్‌ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్‌ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్‌ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. 

ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్‌ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్‌ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్‌–డిజైన్‌పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది.  

Advertisement
 
Advertisement
Advertisement