నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్? | India Aiming To Eliminate Petrol And Diesel Vehicles Says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్?

Jun 2 2024 9:49 PM | Updated on Jun 2 2024 9:59 PM

India Aiming To Eliminate Petrol And Diesel Vehicles Says Nitin Gadkari

దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాహనాల వినియోగం గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంత తక్కువగా ఉందనే తెలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్న సమయంలో కొందరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 10 సంవత్సరాల్లో.. డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.

మార్కెట్లో బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర వాహనాలు కూడా తప్పకుండా ఈవీల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ వాహనాల కోసం పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ కార్ల కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. గడ్కరీ హిమాచల్ ప్రదేశ్‌లోని బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెండానికి కేంద్రం ఇప్పటికే సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడ్డాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

కొత్త ఈవీ పాలసీలు ఆమోదం పొందిన తరువాత ఈవీల సేల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మాత్రమే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలు కూడా ఇదే విధాన్ని పాటించడానికి సుముఖత చూపుతున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విరివిగా అందుబాటులో లేదు. ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారు ఛార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా లేదనే కారణంగానే.. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం చెప్పినట్లు 2034 నాటికి డీజిల్, పెట్రోల్ కార్లను తొలగించాలంటే.. కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement