ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! | India AI Crossroads Build Global Tech or Harness Existing Tools | Sakshi
Sakshi News home page

ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!

May 2 2026 10:52 AM | Updated on May 2 2026 11:09 AM

India AI Crossroads Build Global Tech or Harness Existing Tools

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.

ఆలోచనలు పాతబడ్డాయా?

భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్‌ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.

విశాల్ సిక్కా దార్శనికత

విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌ల బేస్డ్‌ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement