బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు (టీడీఎస్) నిబంధనలపై ఆదాయపన్ను శాఖ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం నిర్ణీత పరిమితిని మించినప్పుడు బ్యాంకులు కచ్చితంగా మూలం వద్దే పన్నును(టీడీఎస్) మినహాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎవరికి ఎంత పరిమితి?
ఆదాయపన్ను నిబంధనల ప్రకారం, డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సంబంధించి వేర్వేరు వర్గాలకు వేర్వేరు పరిమితులను నిర్ణయించారు. సాధారణ పౌరులు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు)కు ఊరటనిస్తూ ఈ పరిమితిని రూ.1,00,000గా నిర్ణయించారు. వడ్డీ ఆదాయం ఈ మొత్తాన్ని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు పన్ను మినహాయింపు ప్రక్రియను చేపడతాయి.
సెక్షన్ల విశ్లేషణ
పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ సంస్థల గురించి ఐటీ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆదాయపన్ను చట్టం, 2025లోని సెక్షన్ 402 ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, 1949 పరిధిలో పనిచేసే అన్ని సంస్థలు దీని కిందకు వస్తాయి. ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్ 51 కింద పేర్కొన్న ఆర్థిక సంస్థలు కూడా ఈ టీడీఎస్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రానట్లయితే టీడీఎస్ మినహాయించకుండా ఉండేందుకు బ్యాంకులకు ఫామ్ 15జీ లేదా 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిటర్లు తమ వడ్డీ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, తద్వారా ఆర్థిక సంవత్సరం చివరలో అనవసర పన్ను భారం పడకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల


