అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో సర్వీసులు అందిస్తున్న యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.
ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాట్జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.
గోయెంకా పోస్ట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్ సప్లై చైన్గా చూడాలని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.
ఇదీ చదవండి: మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!


