ఒక్కటే ఫండ్‌.. అన్ని చోట్లా పెట్టుబడులు | ICICI Prudential Multi-asset fund | Sakshi
Sakshi News home page

ఒక్కటే ఫండ్‌.. అన్ని చోట్లా పెట్టుబడులు

Jun 16 2025 3:24 AM | Updated on Jun 16 2025 8:06 AM

ICICI Prudential Multi-asset fund

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌

పెట్టుబడులు ఎప్పుడూ కూడా తగినంత వైవిధ్యంతో ఉండాలి. దీనివల్ల అస్థిరతలను మెరుగ్గా ఎదుర్కోవచ్చు. ఇలా పెట్టుబడులకు మంచి వైవిధ్యాన్ని ఇచ్చేవే మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ పనితీరు విషయంలో నంబర్‌ 1గా కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఇటీవలి కాలంలో భారీ దిద్దుబాటును చూశాం.

మరీ ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో స్టాక్స్‌ విలువల పతనం లార్జ్‌క్యాప్‌ కంటే మరింత అధికంగా ఉంది. ఇలా ప్రతీ పెట్టుబడుల విభాగంలోనూ వివిధ కాలాల్లో ఆటుపోట్లు ఉంటుంటాయి. అందుకే పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట ఉంచేయకూడదు. రాబడులు, రిస్‌్కకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. నిపుణుల సాయంతో ఈ పనిని మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ సులభతరం చేస్తాయి. కనుక అన్ని రకాల ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు.  

రాబడులు.. 
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 14.53 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల కాలంలో పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 22 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ ఏటా 27.23 శాతం, ఏడేళ్లలో 17.18 శాతం, పదేళ్లలో 15.69 శాతం చొప్పున వార్షిక రాబడిని ఈ పథకం డైరెక్ట్‌ ప్లాన్‌ అందించింది. మల్టీ అస్సెట్‌ ఫండ్‌ విభాగం సగటు రాబడి గత ఏడాది కాలంలో 12 శాతంగా, మూడేళ్లలో 17.55 శాతం, ఐదేళ్లలో 19.89 శాతం, ఏడేళ్లలో 11.53 శాతం, పదేళ్లలో 10.78 శాతం చొప్పునే ఉండడం గమనించొచ్చు.

అంటే మల్టీ అస్సెట్‌ ఫండ్‌ విభాగంతో పోల్చితే ఈ పథకమే వివిధ కాలాల్లో 7 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం 2002లో ప్రారంభం అయింది. మొదట్లో రెగ్యులర్‌ ప్లాన్‌ ఒక్కటే అందుబాటులో ఉండేది. రెగ్యులర్‌ప్లాన్‌లో ఆది నుంచి చూస్తే వార్షిక రాబడి 21 శాతంగా ఉంది. రెగ్యులర్‌ ప్లాన్‌లో ఫండ్స్‌ సంస్థలు మధ్యవర్తులకు కమీషన్‌ చెల్లిస్తాయి. డైరెక్ట్‌ ప్లాన్‌లో అలాంటివేమీ ఉండవు. కనుక దీర్ఘకాలంలో ఒక శాతం వరకు డైరెక్ట్‌ప్లాన్‌లోనే అధిక రాబడి అందుకోవచ్చు. 

పెట్టుబడుల విధానం 
పేరులో ఉన్నట్టు ఈ పథకం ఒకటికి మించిన అస్సెట్‌లలో (పెట్టుబడి సాధనాలు) ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ఈక్విటీలకు 10 నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్‌ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్‌లకు 0–10 శాతం వరకు, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇని్వట్‌)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ పథకం అన్ని ముఖ్య సాధనాల్లోనూ ఎక్స్‌పోజర్‌కు వీలు కల్పిస్తోంది. 

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 57,485 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 49 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ సాధనాలకు 14.17 శాతం కేటాయించింది. కమోడిటీల్లో (బంగారం, వెండి) 11.3 శాతం, రియల్‌ ఎస్టేట్‌ సాధనాల్లో 1.45 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. 23.95 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉండడం గమనార్హం. ఈక్విటీల్లోనూ రిస్క్‌ తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 84 శాతం పెట్టుబడులు పెట్టింది. మిడ్‌క్యాప్‌లో 13.39 శాతం, స్మాల్‌క్యాప్‌లో 1.63 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్‌లో అధిక శాతం రిస్క్‌ తక్కువ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement