
10 గ్రాములకు రూ.1,080 పెరుగుదల
రూ.1,600 జంప్ చేసిన వెండి
న్యూఢిల్లీ: బంగారం మళ్లీ మెరిసింది. జ్యువెలర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,080 పెరిగి రూ.96,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం కేవలం రూ.180 లాభపడి రూ.96,350 వద్ద ముగిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది.
ఔన్స్కు 47 డాలర్లు పెరిగి 3,269 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలోకి రూ.1,600 ఎగసి రూ.97,100 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
యూఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అస్పష్టతకు తోడు వాణిజ్య సంప్రదింపులపై మారుతున్న అమెరికా వైఖరితో ఇన్వెస్టర్లు బంగారంలో షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు చెప్పారు.