బంగారం ఈటీఎఫ్‌ల జోరు | Gold Etfs Log Rs 103 Crore Inflow In May | Sakshi
Sakshi News home page

బంగారం ఈటీఎఫ్‌ల జోరు

Jun 14 2023 7:09 AM | Updated on Jun 14 2023 7:13 AM

Gold Etfs Log Rs 103 Crore Inflow In May - Sakshi

న్యూఢిల్లీ: అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌) మే నెలలో నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ నెలలో రూ.124 కోట్లను బంగారం ఈటీఎఫ్‌లలో నికరంగా పెట్టుబడి పెట్టగా, మే నెలలో 20 శాతం తక్కువగా, రూ.103 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు.

దీనితో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలో మొత్తం ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ మే చివరికి రూ.23,128 కోట్లుగా ఉంది.  ఏప్రిల్‌ చివరికి ఇది రూ.22,950 కోట్లు కావడం గమనార్హం. కాగా,అంతకుముందు నెల మార్చిలో (2023)లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ.266 కోట్లను ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఈ గణాంకాలు విడుదల చేసింది.

మే నెలలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది లాభాల స్వీకరణ వల్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్‌ బ్యాంకులు తదుపరి వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement