ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించే కీలక మార్పులు ఇటీవల తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును (100 శాతం) ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసింది. అర్హత ఉన్న సభ్యులు నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల్లో నిధులను ఉపసంహరించుకునేందుకు ప్రత్యేక కారణాలను వివరించాల్సిన అవసరం కూడా లేదు.
గత అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉపసంహరణ కోసం కారణాలను స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి వచ్చేది. దీంతో అనేక క్లెయిమ్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యేవి. కొత్త విధానంతో ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.
గతంలో ఎలా ఉండేదంటే..
గతంలో ఈపీఎఫ్ సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, సంస్థ లాక్అవుట్, దీర్ఘకాల నిరుద్యోగం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ఈపీఎఫ్ నిధులను పూర్తిగా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇందుకు నిర్దిష్ట కారణాన్ని పేర్కొనడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పేర్కొన్న కారణం ఈపీఎఫ్ఓ ఆమోదించిన కేటగిరీల్లో లేకపోవడంతో క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి.
ఏ పరిస్థితుల్లో 100% ఉపసంహరణ?
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కింది ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అవి..
🔸 సమ్మె, లాక్అవుట్ లేదా సంస్థ మూసివేత కారణంగా 15 రోజులకుపైగా వేతనం లేకుండా ఉండటం.
🔸 రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడం.
🔸 ఉద్యోగం నుంచి తొలగింపు లేదా డిశ్చార్జ్కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండటం.
🔸 సంస్థ ఆరు నెలలకు పైగా మూతపడటం వల్ల ఉద్యోగి నిరుద్యోగిగా మారడం.
🔸 సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం అత్యవసర నిధుల అవసరం ఏర్పడటం.
కొత్త నిబంధనలో ప్రత్యేకత ఇదే..
కొత్తగా తీసుకొచ్చిన వెసులుబాటుతో అత్యవసర పరిస్థితుల్లో 100 శాతం ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసే సమయంలో కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఉండదు. సభ్యుడు సంబంధిత కేటగిరీ కింద క్లెయిమ్ సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల క్లెయిమ్ల పరిశీలన వేగవంతం కావడంతో పాటు తిరస్కరణలు, ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
సాధారణ పరిస్థితుల్లో 75% వరకు మాత్రమే
అయితే ప్రతి సభ్యుడు ఎప్పుడైనా తన మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్ను తీసుకోలేడు. సాధారణ పరిస్థితుల్లో అర్హత కలిగిన మొత్తంలో గరిష్ఠంగా 75 శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. 100 శాతం ఉపసంహరణ మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుంది.
డిజిటల్ సేవలకు ప్రాధాన్యం
గత రెండేళ్లుగా ఈపీఎఫ్ఓ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఆన్లైన్ క్లెయిమ్లు, ఆటో సెటిల్మెంట్, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ వంటి సేవలను వేగవంతం చేసింది. దీంతో చాలా క్లెయిమ్లు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి.


