దశాబ్దాలుగా చైనా ఆర్థిక శక్తిగా ఎదగడంలో కీలకంగా నిలిచిన వలస కార్మిక వ్యవస్థ ఇప్పుడు అనూహ్య మలుపు తిరుగుతోంది. నగరాల్లోని ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తూ దేశ వృద్ధిని పరుగులు పెట్టించిన కోట్లాది మంది కార్మికులు ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఇది కేవలం ఒక సామాజిక మార్పు మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ నిర్మాణాత్మక సంక్షోభానికి సంకేతమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు ఈ తిరుగు ప్రయాణం?
చైనాలో సుమారు 300 మిలియన్ల (30 కోట్లు) వలస కార్మికులు ఉన్నారు. గతంలో గ్రామాల నుంచి నగరాలకు వెళ్లడం, ఎక్కువ సంపాదించి ఇంటికి డబ్బు పంపడం ఒక నిరంతర ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమూనా బీటలు వారుతోంది. దీనికి ప్రధాన కారణాలు..
చైనా జీడీపీలో దాదాపు 25-30% వాటా కలిగిన స్థిరాస్తి రంగం కుప్పకూలడం నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది. పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోవడంతో వేలాది మందికి పనుల్లేకుండా పోయాయి.
అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతల వల్ల చైనా ఫ్యాక్టరీలలో నియామకాలు భారీగా తగ్గాయి.
నగరాల్లో జీవన వ్యయం పెరగడం, దానికి తగ్గట్టుగా వేతనాలు పెరగకపోవడంతో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
నైపుణ్యం లేని వారికి ముప్పు
చైనా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతను అమలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్పై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘పాత పద్ధతుల్లో పనిచేసే కార్మికులకు కొత్త టెక్నాలజీ రంగంలో అవకాశాలు దొరకడం లేదు. ముఖ్యంగా వృద్ధ కార్మికులు ఈ మార్పునకు తట్టుకోలేక తిరిగి వ్యవసాయం వైపు లేదా అసంఘటిత రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు’ అని నిపుణులు చెబుతున్నారు.
సవాళ్లు.. ఆందోళన
చైనా ప్రభుత్వం గతంలో రవాణా రాయితీలు, నగరాల్లో నివాస అనుమతులు సడలించడం వంటి చర్యలు చేపట్టింది. కానీ, సమస్య ఇప్పుడు రవాణా కాదు, ఉద్యోగాల కల్పన. పరిశ్రమల్లో నిత్యం మార్పులొస్తున్నాయి. కానీ శ్రామిక శక్తి పాత నైపుణ్యాలతోనే ఉంది. ఈ స్కిల్ గ్యాప్ (నైపుణ్యాల అంతరం)ను పూరించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఒకవేళ ఈ మిలియన్ల కొద్దీ ప్రజలకు సరైన ఉపాధి లభించకపోతే అది కేవలం ఆర్థిక మందగమనానికే కాదు, రాజకీయ అస్థిరతకు కూడా దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!


