
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీని (డిజిటల్ ట్యాక్స్) తొలగించేలా ఆర్థిక బిల్లులో కేంద్రం సవరణ చేసింది. దీనితో గూగుల్, ఎక్స్, మెటాలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లపై అడ్వర్టైజ్మెంట్ సర్వీసులు అందించే సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ప్రతిపాదిత 59 సవరణల్లో ఇది కూడా ఒకటి.
ఈ సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2016 జూన్ 1న ఈ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు విధిస్తామంటూ హెచ్చరించిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ను భారత్ తొలగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆదాయ పన్ను చట్టాలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఇది దోహదపడుతుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సింఘానియా చెప్పారు.