భారతీయ ఆర్థిక రంగం (బీఎఫ్ఎస్ఐ) రాబోయే దశాబ్దంలో అసాధారణ వృద్ధిని నమోదు చేయనుందని, అయితే విద్యార్థులు కేవలం కొన్ని పాపులర్ ఉద్యోగాల వెంటే పరుగులు పెడుతూ అపారమైన అవకాశాలను కోల్పోతున్నారని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయ కెరీర్ మార్గాలను వీడి, మార్కెట్లో తీవ్ర ప్రతిభ కొరత ఉన్న సరికొత్త విభాగాలపై దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా విద్యార్థులు, విద్యా సంస్థల ప్లేస్మెంట్ సెల్స్ను ఉద్దేశించి కొన్ని అంశాలు పంచుకున్నారు.
85 శాతం మంది చూపు ఒకే వైపు!
క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు ఇప్పటికీ పాత ఆలోచనలతోనే ఉన్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. ‘మా సంస్థ (ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్)కు వస్తున్న వేలాది ఉద్యోగ దరఖాస్తులను గమనిస్తే.. అందులో దాదాపు 85 శాతం మంది కేవలం ఈక్విటీ రీసెర్చ్ లేదా ఇన్వెస్ట్మెంట్ రోల్స్ కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. క్యాంపస్ల్లో ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (ఐబీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) వంటి వాటిని మాత్రమే అత్యున్నతమైనవిగా చూస్తున్నారు. మిగిలిన విభాగాలను తక్కువ ప్రాధాన్యత కలిగిన (సెకండ్ టైర్) కెరీర్లుగా భావిస్తున్నారు. కానీ, ఈ పాత ఆలోచనా విధానం మారాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పారు.
రాబోయే దశాబ్దంలో ఈ రంగాల్లో బూమ్..
పెరుగుతున్న ఆర్థిక సంక్లిష్టతలు, మారుతున్న నియంత్రణల నేపథ్యంలో రాబోయే పదేళ్లలో కొన్ని విభాగాలు తీవ్ర ప్రతిభ కొరతను ఎదుర్కోబోతున్నాయని, అక్కడ పోటీ తక్కువగా ఉండి కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుందని గుప్తా విశ్లేషించారు. ఆ రంగాలు..
రిస్క్ మేనేజ్మెంట్: నియంత్రణ సంస్థల కఠిన నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ విభాగంలో నిపుణులైన ప్రతిభకు డిమాండ్, సప్లై ఎక్కువగా ఉంది.
ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్: ఆధునిక కాలంలో పెట్టుబడి ఉత్పత్తుల రూపకల్పన, మార్కెట్ పొజిషనింగ్, కమ్యూనికేషన్ అనేవి అసలైన పెట్టుబడి నిర్వహణతో సమానంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
డెరివేటివ్స్ ట్రేడింగ్: దేశంలో సరికొత్త ఎస్ఐఎఫ్, హెడ్జ్ ఫండ్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోంది. అయితే దీనికి తగినట్టుగా శిక్షణ పొందిన నిపుణులు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నారు.
ప్రైవేట్ డెట్, మౌలిక సదుపాయాల పెట్టుబడులు: భారతదేశ మౌలిక వసతుల రంగానికి అపారమైన మూలధనం అవసరం. కానీ, ఈ విభాగంలో నిధుల నిర్వహణ చేపట్టే స్పెషలిస్ట్ నిపుణులు చాలా పరిమితంగా ఉన్నారు.
సేల్స్ కెరీర్పై ఉన్నది అపోహే!
ఆర్థిక రంగంలో తప్పుగా అర్థం చేసుకున్న, విస్మరించిన విభాగం సేల్స్ డిపార్ట్మెంట్ అని రాధికా గుప్తా స్పష్టం చేశారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ల సమయంలో సేల్స్ పాత్రల కోసం తమకు అసలు దరఖాస్తులు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ‘సేల్స్ రంగం వ్యక్తిలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని, వ్యాపార చతురతను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన చాలా మంది సీఈఓలు ఒకప్పుడు సేల్స్ లీడర్లుగా పనిచేసినవారే. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో విక్రయ నైపుణ్యాలను ఉపయోగించాల్సిందే’ అని ఆమె పేర్కొన్నారు. గ్లామర్ కోణంలో చూసి ఈ అవకాశాలను వదిలేస్తున్న వారు ఒకే చోట నిలిచిపోతుంటే, ఈ సరికొత్త రంగాలను ఎంచుకున్న కొంతమంది యువత చిన్న వయసులోనే వేగంగా ఎదుగుతూ, భారీగా సంపాదిస్తూ కెరీర్లో స్థిరపడుతున్నారని తెలిపారు.
A LinkedIn post I thought would be worth sharing here too.
An honest open letter to placement cells and campuses:
We get thousands of CVs to join us. 85% of them come for one role: equity research / investing.
I am pretty all 85% of these will get these roles. Or that they…— Radhika Gupta (@iRadhikaGupta) May 31, 2026
విజయానికి మూడు ప్రశ్నలు
యువత తమ కెరీర్ను ఎంచుకునేటప్పుడు గుంపుతో కలిసి పోకుండా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడిలా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అభ్యర్థి తమను తాము ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నారు.
1. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది ఏమిటి?
2. ఏ విభాగంలో పోటీ తీవ్రత చాలా తక్కువగా ఉంది?
3. నేను ఏ పనిని సమర్థవంతంగా చేయగలను?
ఈ కోణంలో ఆలోచిస్తే డిమాండ్ ఉండి సరైన సప్లై లేని మార్కెట్లను సులభంగా గుర్తించవచ్చని ఆమె సూచించారు.
ఇదీ చదవండి: ఫిన్టెక్ సేవల్లోకి ఎల్ఐసీ


