ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఐపీవో ధర రూ. 305-306

Angel broking public issue on 22nd -price band rs 305-306 - Sakshi

22 నుంచి పబ్లిక్‌ ఇష్యూ- 24న ముగింపు

ఇష్యూ ద్వారా రూ. 600 కోట్ల సమీకరణ యోచన

రిటైల్‌ ఇన్వెస్టర్లకు కనీస లాట్‌ 49 షేర్లు

బ్రోకింగ్‌ బిజినెస్‌లో 6.3 శాతం మార్కెట్‌ వాటా  

దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్‌ బ్రోకింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఇష్యూ ఈ నెల 22న(మంగళవారం) ప్రారంభమై 24న(గురువారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్‌ బ్రోకింగ్‌ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. 

బ్యాక్‌గ్రౌండ్‌..
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు సైతం ఏంజెల్‌ బ్రోకింగ్‌ షేర్లను విక్రయించనుంది. తద్వారా ఈ నెల 21న నిధులు సమకూర్చుకోనుంది. ఐపీవోకు కనీస లాట్‌ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాగా.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్‌ సర్వీసులను ఏంజెల్‌ బ్రోకింగ్‌ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్‌, అడ్వయజరీ, మార్జిన్‌ ఫండింగ్‌, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్‌ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్‌ సంస్థగా ఏంజెల్‌ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్‌ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్‌ బ్రోకింగ్‌.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top