గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.
పెరుగుతున్న ఉత్కంఠ
ఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.
మౌలిక సదుపాయాలు..
ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.
స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్
ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.
పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?
సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.
ఆగిపోని విప్లవం
ఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?


