భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.
వచ్చే జీతం చాలడం లేదు
మునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.
చదువు, వైద్యం, ఇల్లు
మధ్యతరగతి బడ్జెట్ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.
‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’
పొదుపు మాయం.. అప్పులే శరణ్యం
ఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.
ఆశలు నీరుగారుతున్నాయి
మధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.
‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?


