అశ్వాపురం: అణుశక్తి ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్ఎఫ్ఎఈఈ) ఎనిమిదో జాతీయ మహాసభలు ఈ నెల 5, 6వ తేదీల్లో జరగనున్నాయి. అశ్వాపురం గౌతమీనగర్లోని తరంగిణి హాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం అధ్య క్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఎస్ఏఎస్ఎస్ఏ అధ్యక్షుడు గడ్డం రమేశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు మాట్లాడారు. భారజల ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, సూపర్వైజర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన సభలు జరుగుతాయని తెలిపారు. సభల్లో సమస్యలపై చర్చించడమే కాక నూతన కమిటీని ఎన్నుకుంటామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు రాయల రాజేశ్, కే.వీ.వీ.రాజు, మోహన్బాబు, ఎస్కే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా
క్రికెట్ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి అండర్–14, 16 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకట్, కోఆర్డినేటర్ ఎండీ మసూధ్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డుతో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. వివరాలకు ఎండీ ఫారుఖ్ను 79818 81095 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
జాతీయస్థాయిలో
బీటీపీఎస్ కీర్తిని చాటాలి
మణుగూరురూరల్: రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జరిగే క్రీడాపోటీల్లో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగ క్రీడాకారులు ప్రతిభ కనబర్చి ప్లాంట్ కీర్తిని చాటాలని బీటీపీఎస్ సీఈ బి.బిచ్చన్న ఆకాంక్షించారు. టీజీజెన్కో ఆధ్వర్యంలో చల్పూర్లో నిర్వహించిన ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రికెట్ టోర్నమెంట్లో మణుగూరు బీటీపీఎస్ జట్టు విజేతగా నిలిచి, కప్ గెలిచింది. శుక్రవా రం జట్టు సభ్యులను సీఈ బిచ్చన్న అభినందించి, మాట్లాడారు. ఉద్యోగుల శారీరక, మానసిక దృఢత్వం కోసం టీజీ జెన్కో సంస్థ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఉద్యోగులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందన్నారు. ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ (అడ్మిన్) మురళీకృష్ణ, డీఈ(టెక్) సత్యనారాయణమూర్తి, క్రీడా కార్యదర్తి కల్తీ నర్సింహారావు, కెప్టెన్ గోపి, హేమమూర్తి, అశోక్రెడ్డి, నవీన్, రవి, సంపత్, తిరుపతి, అనిల్, ప్రవీణ్, విశృత్, దుర్గాప్రసాద్, రఫీ, భరత్, రాము, శివ, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
మండలవాసికి
‘మహారాష్ట్ర’ పురస్కారం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారంవారిగూడెంకాలనీకి చెందిన సాహస వీరుడు భూక్యా కృష్ణనాయక్కు మరో అవార్డు దక్కింది. ఇప్పటికే మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించడం, అసాధారణ ధైర్య, సాహసాలు ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయనకు తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం వసంతరావునాయక్ జయంతి సందర్భంగా కృష్ణనాయక్కు ‘రాష్ట్రియ స్టంట్ కళాకారుడు’ అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నీలంగలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖుల చేతులమీదుగా సన్మానం అందుకున్నారు. అవార్డు గ్రహీత కృష్ణనానయక్ మాట్లాడుతూ.. ఆర్థిక సాయం అందిస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికులు, బంధువులు, తోటి కళాకారులు ఆయన్ను అభినందించారు.


