భద్రాచలంఅర్బన్: గిరిజన సంక్షేమానికి, భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాజాప్రసాద్ తెలిపారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజును యూనియన్ బ్యాంక్ ఖమ్మం రీజినల్ కార్యాలయ అధికారులు కలిసి చర్చించారు. ఐటీడీఏ నుంచి ప్రతిపాదనలు వస్తే అమలు చేస్తామని అన్నారు. తొలుత ఏపీఓకు మొక్కను అందజేశారు. అనంతరం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఏఈఓ భవానీ రామకృష్ణను కలిసి రామాలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. చీఫ్ మేనేజర్ రాజాప్రసాద్, సీనియర్ మేనేజర్ సతీష్, భద్రాచలం శాఖ మేనేజర్ శివకృష్ణమాచారి, భద్రాచలం యూనియన్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ కోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్తంభాన్ని ఢీకొన్న కారు
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల నుంచి పాల్వంచకు వెళ్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. రేగళ్ల ప్రదాన రహదారిపై కారు ఆదుపుతప్పడంతో పక్క నే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం పూర్తిగా కూలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
హత్యా.. ఆత్మహత్యా..?
సింగరేణి ఉద్యోగి అనుమానాస్పద మృతి
సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గౌతంపూర్ పంచాయతీ పరిధిలోని మిలీనియం క్వార్టర్స్లో నివాసముంటున్న పిట్టల చంద్రమోహన్ (48) సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎస్అండ్ పీసీ విభాగంలో సీనియర్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం వాకింగ్కు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన చంద్రమోహన్ తిరిగి రాలేదు. రామవరం ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం అక్కడ ఇంట్లో ఉరివేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గౌతంపూర్లో నివసించే చంద్రమోహన్ రామవరంలో ఉరివేసుకుని మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆత్మహత్యనా..? హత్య చేసి ఉరి వేసుకున్నాడని చిత్రీకరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఇదే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాల కోసం టూటౌన్ పోలీసులను సంప్రదించగా శుక్రవారం రాత్రి వరకు స్పందించలేదు. టూటౌన్ సీఐ బదిలీ కావడం, ఇక్కడికి బదిలీపై రావాల్సిన సీఐ రాకపోవడంతో పలు కేసుల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యుత్షాక్తో ఒకరి మృతి
సూపర్బజార్(కొత్తగూడెం): రామవరం నాగయ్యగడ్డకు చెందిన పి.కల్యాణ్ (34) శుక్రవారం తన ఇంట్లో విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యా డు. భార్య సౌజన్య కథనం ప్రకారం.. కల్యాణ్ ఇంటిపై ఉన్న వాటర్ట్యాంకులోకి నీరు ఎక్కించేందుకు మోటార్ ఆన్ చేయగా నీరు ఎక్కలేదు. ఏమైందో చూడటానికి మోటారును పరిశీలించే క్రమంలో వర్షానికి తడిసి ఉండడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని ధ్రువీకరించారు. కల్యాణ్కు భార్య సౌజన్యతో పాటు పెద్ద కుమార్తె చిట్టి ఓంకారి (6), చిన్న కుమార్తె ప్రియాన్షి (3 నెలలు) ఉన్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ నాయకుడైన కల్యాణ్ మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు.


