పన్నెండో శతాబ్దానికి చెందినది..
● శిల్పం చెక్కి 800 ఏళ్లు దాటినట్లు అంచనా..? ● ప్రముఖ చరిత్ర పరిశోధకులు కరిపె రాజ్కుమార్
చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు గ్రామ శివారు కనకగిరి గుట్టలపై వేంచేసి ఉన్న హస్తాల వీరన్నస్వామి విగ్రహం అత్యంత పురాతనమైందని కరీంగనర్కు చెందిన ప్రముఖ పరిశోధకులు కరిపె రాజ్కుమార్ అన్నారు. కనకగిరి గుట్టలను సందర్శించిన ఆయన.. హస్తాలవీరన్న విగ్రహం చెక్కి సుమారు 800 ఏళ్లకు పైబడే ఉంటుందన్నారు. శిల్పశాస్త్రం ప్రకారం ఇది ఆరుదైన విగ్రహమని, పద్దెనిమిది హస్తాలతో చెక్కిన ఈ విగ్రహం.. ప్రకృతిని కాపుడుతున్నట్లు ఉందని వివరించారు. శూలం, పరుశు, ఖడ్గం, వజ్రం, అభయం, నాగం, పాశం, అంకుశం, గంట అస్త్రాలను ధరించిన వీరన్నస్వామి ప్రకృతి పాలకుడిగా ఉన్నాడని పేర్కొన్నారు.
బెండాలపాడు కనకగిరి గుట్టలపై వేంచేసి ఉన్న హస్తాలవీరన్న విగ్రహం పన్నెండో శతాబ్దానికి చెందినది. ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే లేదు. దీని ప్రాముఖ్యతపై ప్రభుత్వం ప్రచారం చేయాలి. భక్తులు స్వామివారిని దర్శించుకునేందు సౌకర్యాలు కల్పించాలి.
–కరిపె రాజ్కుమార్, పరిశోధకుడు, కరీంనగర్


