● త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ ● హాజరైన మంత్రి పొంగులేటి దంపతులు, కలెక్టర్ అంకిత్
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీదేవీ, భూదేవీ సమేత బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం నయనానందకరంగా సాగింది. ఆరు రోజులుగా వేడుకలు జరుగుతుండగా చివరి రోజైన బుధవారం చినజీయర్ స్వామి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో జరిగిన పూజల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – మాధురి దంపతులు, కలెక్టర్ అంకిత్తో పాటు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రధానార్చకులు ప్రసాదాచార్యుల పర్యవేక్షణలో గర్భాలయంలో ప్రథమారాధన, శాంతికల్యాణం, మంగళనీరాజనం నిర్వహించారు. ఆ తర్వాత జీయర్స్వామి చేతుల మీదుగా ప్రధాన ఆలయ శిఖర గోపుర కలశానికి మహాకుంభప్రోక్షణ చేశారు. మంత్రి పొంగులేటి, కలెక్టర్ అకింత్ సైతం పాలుపంచుకున్నారు. తదుపరి భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల ఆలయాల గోపుర కలశాలకు సంప్రోక్షణ చేయగా భక్తులు చేసిన జైశ్రీమన్నారాయణ, గోవిందా గోవిందా నామస్మరణతో గ్రామం మార్మోగింది. టీఎస్ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, సర్పంచ్ లకావత్ లక్ష్మి, ఈఓ రజనీకుమారి, మేనేజర్ పాకాల వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు పర్సా వెంకటేశ్వర్లు, బొంకూరి సురేశ్, వనమా శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, బోడా పద్మ, శ్రీను, శివాలయ పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు, చైర్మన్ మల్లేల నర్పింహారావు, వనమా గాంధీ, బోయినపల్లి సుధాకర్రావు, వేముల నరేశ్, భారీగా భక్తులు పాల్గొన్నారు.


