మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో హెచ్పీ గ్యాస్ పంపిణీకి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై హిందుస్థాన్ పెట్రోలియం రాష్ట్ర సేల్స్ అధికారి పవన్ బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 620 సిలిండర్లు పక్కదారి పట్టినట్లు బయటపడింది. ఈ మేరకు సిలిండర్ల పంపిణీ నిర్వహిస్తున్న సొసైటీకి రూ.8 లక్షల జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా సరఫరా చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాక ఆన్లైన్ చెల్లింపులు చేసిన వారికి వెంటనే గ్యాస్ సరఫరా, పాత విధానంలో బుకింగ్ పునరుద్ధరణకు కృషి చేస్తామని చెప్పారు. మరో ఇరవై రోజుల్లో గ్యాస్ సరఫరా పూర్తిగా గాడిలో పడుతుందని తెలిపారు. ఈ మేరకు సేల్స్ అధికారి పవన్కు టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇవ్వడమే కాక, పలు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడంపై సన్మానించారు.
ఏజెన్సీకి రూ.8 లక్షల జరిమానా


