సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసిన అవార్డుల్లో సుమారు 20 శాతం అవార్డులు జిల్లా టీవీవీపీ ఆస్పత్రులకు దక్కడం శుభపరిణామమని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు గురువారం కలెక్టర్ అంకిత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత కలెక్టర్ జితేష్ పాటిల్ నుంచి ప్రస్తుత కలెక్టర్ అంకిత్ వరకు సంపూర్ణ మద్దతు, సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సూపరింటెండెంట్లు తెలిపారు. వివిధ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సూచించిన అంశాలను ముందుండి గత ఒకటిన్నర ఏళ్లుగా దూరప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో రక్త నిల్వ కేంద్రాల స్థాపన, ఆపరేషన్ థియేటర్ల అభివృద్ధి, నిపుణులైన వైద్యులను ప్రోత్సాహకాలతో నియామకం, డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్ పరికరాల సమీకరణ, డిజిటల్ ఎక్స్–రే, ఈసీజీ యంత్రాల ఏర్పాటు, ఆస్పత్రుల మరమ్మతులు, పునరుద్ధరణ, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యాలు, డైట్, శానిటేషన్ సదుపాయాలు, వార్డుల్లో ఏసీలు, కూలర్లు తదితర మౌలిక వసతులు మెరుగుపర్చారని వివరించారు. ఈ చర్యల ఫలితంగా ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, క్లిష్ట కేసులను స్థానికంగానే నిర్వహించబడుతున్నట్లు చెప్పారు. అనంతరం సూపరింటెండెంట్లు కలెక్టర్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, రామ్ప్రసాద్, గౌరీప్రసాద్, హర్షవర్ధన్, జీజీ హెచ్ సూపరింటెండెంట్ రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు.


