ఇల్లెందు: ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కోపోద్రికులైన కుటుంబీకులు ఇల్లెందుపోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలిలా.. ఈ నెల 5వ తేదీన గుండాల మండలం కాచనపల్లి జగ్గుతండాకు చెందిన గుగులోత్ పవన్(27) ఇంటి నుంచి బయలుదేరి టేకులపల్లి మండలం దాసుతండా అక్కడి నుంచి ఇల్లెందు చేరుకున్నాడు. తిరిగి ఇంటికి బయలుదేరే క్రమాన ఇల్లెందు నుంచి గుండాలకు వెళ్లే ఆర్టీసీ బస్ మిస్ కావడంతో ఓ కిరాయి ఆటోలో జగ్గుతండాకు బయలు దేరాడని, ఇంటికి చేరకుండా మార్గమధ్యలో తన తమ్ముడు పవన్ను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని సోదరుడు గుగులోత్ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఖమ్మంలో వైద్యం పొందుతున్న పవన్ మృతి చెందగా.. ఖమ్మం నుంచి మృతదేహంతో నేరుగా ఇల్లెందు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సీఐ సురేష్ ఆందోళనకారులతో చర్చించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆటో డ్రైవర్ వంశీ, హరి, వెంకన్నలపై తమకు అనుమానం ఉందని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.


