టేకులపల్లి: మండలంలోని బేతంపూడిలో ఉన్న హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బిహారీ బాబా దర్గా ఉర్సు వేడుకలు ఈనెల 10న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఉర్సు కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. కులమతాలకు అతీతంగా జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దర్గా ఆవరణలో తోరణాలు కట్టారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సూపర్ బజార్కు చెందిన సి.మాలిక్ నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు. గంధం దర్గాలో సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో ఢిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నుస్రత్ ఆలీ జహంకార్ ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏటా సుమారు పది వేల మందికిపైగా భక్తులు తరలివస్తారని, ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


