● విధులు బహిష్కరించిన కేటీపీఎస్ కార్మికులు ● మద్దతు పలికిన కార్మిక సంఘాలు
పాల్వంచ: తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగారు. కేటీపీఎస్ ఆస్పత్రి ముందు గ్రౌండ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న తమను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్లుగా గుర్తించినా బ్రిటీష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్లను అంటగట్టి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే సంస్థలో వేర్వేరు రూల్స్ ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో సుమారు 23,600 మంది ఆర్టిజన్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళన బాటపట్టినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించేవరకు విధులకు హాజరుకాబోమని కార్మికులు హెచ్చరించారు. నాయకులు సాయిలు, పురుషోత్తం రావు, బాలకృష్ణ, అనిల్, నర్సింహారెడ్డి, రమేష్, ఆవుల కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, మల్లయ్య, వేణుగోపాల్ రెడ్డి, సాయిబాబు, వెంకట్రావ్, రమేష్, సాంబ, రవీందర్, శ్రీనివాసరావు, శారద నిమ్మల రాంబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎంఎ.వజీర్, కోటేశ్వరరావు, సాధం రామకృష్ణ, చారుగుండ్ల రమేష్, రాధకృష్ణ, అంకిరెడ్డి నరసింహారావు, రావుల మురళి, గొర్రె వేణుగోపాల్, పూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సుమారు 1500 మంది విధులకు గైర్హాజరు
కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో సుమారు 2200 మంది ఆర్టిజన్లు ఉండగా, బుధవారం సుమారు 1500 మంది వరకు విధులకు గైర్హాజరయ్యారు. రెండు షిఫ్ట్ల్లో కలిపి భారీ సంఖ్యలో కార్మికులు విధులు బహిష్కరించారు. కాగా, ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, విధులకు రాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది యాజమాన్యం పరిధిలో ఉందని సీఈలు ఎ.ప్రభాకర్ రావు, సూర్యనారాయణ తెలిపారు.


