టోకుగా స్వాహా!
నెలవారీగా అందించే సన్న బియ్యాన్ని ఒకేసారి మూడు నెలలకు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు రేషన్ మాఫియా రంగంలోకి దిగింది. ఇందుకోసం అక్రమ తరలింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వన్ అండ్ ఓన్లీ మ్యాన్, తన రైట్, లెఫ్ట్ హ్యాండ్లను పురమాయించాడు. ‘ఓన్లీ వన్ ఫసక్’ అన్నట్టు రేషన్ బియ్యంతో ఖజానా నింపుకునేందుకు మాఫియా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తోంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో జరిగే రేషన్ దందాలో ‘సింహ’భాగం అక్రమ రవాణాకు హేమచంద్రాపురం అడ్డాగా మారినట్టు సమాచారం. గడిచిన వారం రోజులుగా రోజుకో లారీ లోడ్ రేషన్ బియ్యం ఇక్కడి నుంచి తరలివెళ్తోంది. ఇక్కడున్న క్రీడా మైదానం దందాకు హబ్గా మారినట్టు స్థానికులు చెబుతున్నారు.
బూడిదగడ్డ ఏరియా ఒకప్పుడు రేషన్ దందాకు ‘పవర్’సెంటర్గా ఉండేది. పాత దందాను చక్కబెట్టిన వ్యక్తులే మరోసారి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పగటి వేళ కూల్డ్రింకులు సరఫరా చేసే ట్రాలీ ఆటోల్లో రాత్రి వేళ రేషన్ బియ్యాన్ని తేలిగ్గా సేకరించి, పక్కదారి పట్టిస్తున్నారు.
సుజాతనగర్ మండల పరిధిలో ఏకంగా ఒక రేషన్ డీలరే, సన్నబియ్యం మాఫియాతో నేరుగా సంబంధం పెట్టుకుని, లబ్ధిదారుల బయోమెట్రిక్తో సహా మేనేజ్ చేస్తూ సీల్ తీయకుండానే బస్తాలకు బస్తాలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు వైనం వెలుగు చూడటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేశారు.


