● వదిలేసిన తల్లి.. మరణించిన తండ్రి.. ● ఇద్దరు చిన్నారులను పోషిస్తున్న నాయనమ్మ
పాల్వంచరూరల్: తల్లి వదిలేసి వెళ్లింది.. తండ్రి ఇటీవల మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ గండికోట ప్రసాద్, కృష్ణవేణిని వివాహం చేసుకున్నాక ఇద్దరు కుమారులు ఆరేళ్ల భార్గవ్, ఐదేళ్ల రోహిత్శర్మ జన్మించారు. వీరు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనేపథ్యాన తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తల్లి ఇద్దరి పిల్లలను వదిలేసి హైదరాబాద్కు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న తండ్రి కూడా ఇటీవల మృతిచెందడంతో అనాథలుగా మిగిలారు.
పోషణ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం ఒంటరి వృద్ధురాలైన నాయనమ్మ ఐలమ్మ వద్ద ఆ ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే తాను ఉన్నంత వరకే పిల్లలను పోషించగలను.. తదనంతరం పరిస్థితి ఏంటని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో ఇద్దరి చిన్నారుల ఉన్నత చదువులకు సహకారం అందిస్తానని మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య తెలిపారు.


