● నిరంతర పర్యవేక్షణ, సమన్వయం అవసరం ● ఐఏఎస్ అధికారికి బాధ్యత అప్పగిస్తే మేలు
భద్రాచలం: గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ప్రకటించింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పను ల పర్యవేక్షణ, గోదావరి పుష్కరాల పనుల బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు.
మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలకు
భారీగా నిధులు
గోదావరి పుష్కరాలు 2027, జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కారిడార్లో పుష్కరాల విజయవంతానికి సుమారు 300 రూ. కోట్ల వరకు కేటాయించింది. భక్తులు అధికసంఖ్య లో వచ్చే భద్రాచలం వద్ద ఏర్పాట్లపై దృష్టి సారించింది. నెల రోజుల క్రితం పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రాచలం వద్ద సుమారు రూ.60కోట్ల నుంచి రూ. 80 కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. దీంతో ఈ ఏడాది పుష్కరాల పనులు నిర్విరామంగా జరగనున్నాయి. ఇటీవల భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశా రు. మొత్తంగా రూ.586 కోట్లు కేటాయించగా, మూ డు విడతలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో రూ.75కోట్లతో గోదావరి ఘాట్ల విస్తరణ, రూ.180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ.96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి.. మొత్తంగా రూ.351 కోట్ల పనులను చేయనున్నారు. వీటిని మార్చి 2027 లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రెండో విడతలో 2028 నాటికి కాపా రామలక్ష్మమ్మ ట్రస్టు వద్ద ఉన్న ఆరెకరాల స్థలంలో రూ.108 కోట్లతో పనలు చేపట్టాల్సి ఉంది. మూడో విడతలో రూ.127 కోట్లతో భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులు 2029వరకు పూర్తిచేయనున్నారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి.
ఐఏఎస్కు బాధ్యతలు అప్పగిస్తే...
పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పుష్కరాల సమయంలో చివరి నిమిషంలో పనులు పూర్తి కాక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇటువంటి సమస్య రాకుండా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మేలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బి.రాహుల్ ఇద్దరు ఐఏఎస్లు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తగిన ఆలోచన చేసి వీరిద్దరిలో ఒకరికి లేదా మరో సీనియర్ అధికారికి అభివృద్ధి పనుల బాధ్యతలను అప్పగించాలని భక్తులు కోరుతున్నారు.


