● విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● తడిసిన ధాన్యం, మిర్చి, దెబ్బతిన్న ఇళ్లు
అశ్వారావుపేటరూరల్/చర్ల: గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం అశ్వారావుపేట, చర్ల తదితర మండలాల్లో అకాల వాన కురిసింది. భారీవర్షం కురవడంతో ఇళ్ల పైకప్పులు, రేకులు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగి పలుచోట్ల పైకప్పులు, రేకుల షెడ్లు ధ్వంసం కాగా, ఇళ్లలోఉన్న వారంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆసుపాక గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. అశ్వారావుపేట–భద్రాచలం, ఖమ్మం ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామిడి, పొగాకు తోటలకు నష్టం జరిగింది. చర్లలో రాళ్ల వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి పంటలు తడిసిముద్దయ్యాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. చేతికొచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


