‘మిషన్ పదో తరగతి’ పోస్టర్ల ఆవిష్కరణ
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ పదో తరగతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి శనివారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 111 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.2.2 కోట్ల నగదు బహుమతులు, మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్కు రూ.2 లక్షలు, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల టాపర్లకు రూ. లక్ష చొప్పున, 612 మండలాల టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 2026 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈడీఎం సైదేశ్వర రావు , శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీహరిరావు, మేనేజర్ ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


