● బ్యాలెట్ పేపర్లు వచ్చేశాయ్..
సత్తుపల్లిటౌన్: మున్సి పల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి కావడంతో ప్రత్యేక వాహనంలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేర్చి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంకు సీల్ వేయడంతో పాటు సాయుధ బలగాలతో గస్తీ ఏర్పాటు చేశారు. వీటిని 10వ తేదీన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేర్చి అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అందించనున్నారు. కాగా, సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, 28,830 మంది ఓటర్లు ఉండగా అదనంగా 15 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించినట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ తెలిపారు.
● వంద రోజుల్లో ఇల్లెందుకు రైలు!
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో 17 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారని, వీరిలో కనీసం పది మందిని గెలిపిస్తే వంద రోజుల్లో ఇల్లెందుకు రైలు వచ్చేలా కేంద్రంలో చక్రం తిప్పుతామని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. శనివారం ఇల్లెందులో బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే నిధుల పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు డాక్టర్ విజయ చంద్రా రెడ్డి, బలగానీ గోపీకృష్ణ, మురళీకృష్ణ, పూన్యా నాయక్, మహేశ్వర్, మాధవ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● బ్యాలెట్ పేపర్లు వచ్చేశాయ్..


