దేవాదాయ శాఖ ఆదాయానికి గండి
● గతేడాది కంటే తక్కువ అద్దెకు షాపుల కేటాయింపు ● పెద్దమ్మతల్లి ఆలయంలో రూ.6.22 లక్షలు కోల్పోయిన వైనం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ ఆదాయానికి గండి పడింది. గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలో దేవాదాయ శాఖ అధికారులు రెండు దుకాణాలను తక్కువ ఽఅద్దెకు కేటాయించారు. చీరలు పోగుచేసే పాట కూడా తక్కువకే అప్పగించారు. అమ్మవారి ఆలయ పాత కాంప్లెక్స్లోని 3వ నంబర్ షాపునకు గతేడాది నెలకు రూ.75 వేల అద్దెకు కేటాయించారు. ఈసారి మాత్రం రూ.42 వేలకే అప్పగించారు. గతం కంటే రూ.33 వేలు తగ్గింది. 4వ నంబర్ షాపునకు గతేడాది నెలకు రూ.42 వేల అద్దెకు కేటాయించగా, ఈసారి రూ.27 వేలకే అప్పగించారు. గతం కంటే ఈసారి రూ.15 వేల ఆదాయం తగ్గింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు పోగు చేసుకునేందుకు గతేడాది రూ.16 లక్షలకు కేటాయించగా, ఈసారి రూ.15.06 లక్షలకే కేటాయించారు. ఫలితంగా గతేడాదికంటే రూ.94 వేల ఆదాయం తగ్గింది.
కేటాయింపులపై పలు సందేహాలు!
దేవాదాయ శాఖ అధికారులు వేలంపాటను 11 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 3,4 నంబర్ షాపులు రెండింటికి కలిపి గతం కంటే నెలకు రూ.48 వేల ఆదాయం తగ్గిపోయింది. 11 నెలలకు రూ.5.28 లక్షల మేర ఆదాయం తగ్గింది. చీరల వేలంపాటలో రూ. 94 వేల ఆదాయం తగ్గింది. దుకాణాలు, చీరలకు కలిపి మొత్తం రూ.6.22 లక్షల ఆదాయం పెద్దమ్మతల్లి ఆలయం ద్వారా దేవాదాయ శాఖ కోల్పోయినట్లయింది. వేలంపాట తక్కువ ధరలకు కేటాయించడంపై భక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. షాపులు, చీరలు పోగుచేసుకునేందుకు పలుమార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. మూడు నెలలుగా షాపులు ఖాళీగా ఉంటున్నాయని, దీంతో శుక్రవారం జరిగిన వేలంపాటలో తక్కువ అద్దెకు కేటాయించామని వివరించారు.


