ఎన్నికల్లో కిక్కే కీలకం !
వైరా: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో కీలకమైన మద్యాన్ని పోలింగ్ ముందు రోజు పంపిణీ చేసేలా భారీగా స్టాక్ సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాక తమ వెంట రోజు వారీ ప్రచారంలో పాల్గొంటున్న వారికి అల్పాహారం, భోజనంతో పాటు రాత్రివేళ మద్యం సమకూరుస్తున్నారు. కాగా, వైరాలో ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి ఈనెల 2వ తేదీన రూ.5.60కోట్లు, 3వ తేదీన రూ.5.60కోట్లు, 4వ తేదీన రూ.6.60కోట్లు, 5వ తేదీన రూ.7కోట్లు, 6వ తేదీన రూ.6.10కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగాయి. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే, పోలింగ్కు ముందే మద్యం షాపులు బంద్ చేయనుండడంతో ముందస్తుగా స్టాక్ సమకూర్చుకోవడంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
ఐదు రోజుల్లో రూ.30.90 కోట్ల మద్యం విక్రయాలు


