గిరిజన మ్యూజియంలో ఫ్రాన్స్ దేశస్తులు
భద్రాచలం: భద్రాచలంలోని గిరిజన మ్యూజియంను ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫిలిప్, ఖ్యాతి ఫ్రాన్స్ దంపతులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మ్యూజియంలో ఏర్పాటు చేసిన కళాఖండాలను తిలకించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ, గిరిజన తెగల జీవితాన్ని తెలుసుకోవడానికి గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసిన ఐటీడీఏకు ధన్యవాదాలు తెలిపారు.
దెందుకూరు గోడౌన్లలో ఆకస్మిక తనిఖీ
మధిర: మండలంలోని దెందుకూరు గ్రామంలోని గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లలో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యత, నిల్వ పరిమాణాన్ని పరిశీలించారు. రక్షణ ఏర్పాట్లు, గోదాముల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఆహార ధాన్యాలు ప్రజలకు చేరే వరకు నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ముదిగొండ: మండలంలోని గంధసిరి మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు పెద్దమండవ మున్నేరు నుంచి తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను శనివారం సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో సువర్ణాపురం, న్యూలక్ష్మీపురం గ్రామాల సమీపంలో పట్టుకున్నారు. ఎనిమిది ఇసుక ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించి, ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి తెలిపారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బచ్చోడుతండాకు చెందిన గుగులోత్ పాండు (43) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం చేను వద్ద గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిరిజన మ్యూజియంలో ఫ్రాన్స్ దేశస్తులు


