నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఐదు రోజుల పాటు సంగీతఝరి..
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణ కర్త, ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేవస్థానం, అలివేలు మంగా సర్వయ్య చారిటబుల్ ట్రస్టు, సామగా నలహరి కల్చరల్ ట్రస్ట్, నాదసురంగణి వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి సంగీత కళాకారులు హాజరై ప్రేక్షకులను అలరించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రతీరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు నగర సంకీర్తనతో జయంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా 8 గంటలకు రామదాసు విగ్రహానికి అభిషేకం, 9 గంటల నుంచి చిత్రకూట మండపంలో నవరత్న కీర్తన ఘోష్టి, 10 గంటలకు నేండ్రగంటి కృష్ణమోహన్, కపిలవాయి లలిత సంగీత ప్రదర్శనలు జరగనున్నాయి. సాయంత్రం మల్లాది సోదరుల సంగీత ప్రదర్శనలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
నేటి నుంచి రామదాసు
జయంత్యుత్సవాలు


