సీపీఐలో సమరోత్సాహం
ఉత్తేజం నింపిన ఉత్సవాలు
● పార్టీ వందేళ్ల ఉత్సవాల సక్సెస్తో ఆనందం ● నాలుగు రోజుల పాటు ఇక్కడే సీపీఐ అగ్రనాయకత్వం ● బీజేపీ, ఆర్ఎస్ఎస్సే లక్ష్యంగా నేతల ప్రసంగాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి జిల్లాలోని సీపీఐ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చారు. ఈ సభకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హాజరుకావడమే కాక సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఏఐఎఫ్బీ జాతీయ నేతలతోపాటు దేశ, విదేశాల నుంచి వామపక్షాల నేతలు, రాయబారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కాగా, ఖమ్మంలో ఈనెల 18సభతో ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాలు బుధవారం ముగిశాయి.
ఇక్కడే సభ, కౌన్సిల్
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించిన నేతలు కొద్దినెలలుగా ఏర్పాట్లు ప్రారంభించారు. పార్టీ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2024 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోనే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముగింపు సభ ఖమ్మంలో నిర్వహించగా, విజయవంతం కోసం పార్టీ శ్రేణులు పల్లె, పట్టణంలో విస్తృత ప్రచారం చేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు పర్యవేక్షించారు. అంతేకాక ముగింపు సభతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశం, కౌన్సిల్ కూడా ఇక్కడే నిర్వహించడంతో జాతీయ నాయకత్వం సైతం తరలివచ్చింది.
అంబరాన్నంటిన వందేళ్ల సంబురం
పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న జరగగా ఈ సభకు సీపీఐ అగ్రనాయకత్వంతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అలాగే దేశవిదేశాల నుంచి వామపక్షాల ప్రతినిధులు, రాయబారులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ శ్రేణులు శ్రేణులు హాజరు కావడంతో సభ విజయవంతమైంది.
ఐక్యత – దేశ పరిస్థితులపై చర్చ
ముగింపు సభ తర్వాత ఖమ్మంలోనే సోమవారం సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం, మంగళవారం సెమినార్తో పాటు మంగళ, బుధవారం జాతీయ కౌన్సిల్ నిర్వహించారు. సెమినార్లో పాల్గొన్న వామపక్ష పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ దేశ భవిష్యత్కు వామపక్షాల ఐక్య పోరాటాలే శరణ్యమని ఉద్ఘాటించారు. అలాగే, కేంద్రప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల వైఖరితో ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని, రైతులు, కార్మికులు, శ్రామికుల హక్కులను కాలరాస్తోందని పేర్కొన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటేనే ఈ శక్తులను ఎదుర్కొనేందుకు వీలవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఖమ్మం వేదికగా జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈనెల 18న సభతో ప్రారంభమైన ఉత్సవాలు బుధవారం జాతీయ కౌన్సిల్ సమావేశాలతో ముగిశాయి. వామపక్షాల ప్రతినిధులు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండి వివిధ అంశాలపై చర్చించారు. కొన్నేళ్లుగా వరుస ఓటములు, చట్టసభల్లో ప్రాతినిధ్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ శతాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపిరిలూదాయని భావిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన నేతలు ఉత్సాహంతో కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయాన కొద్దినెలలుగా ఉత్సవాల విజయవంతానికి కృషి చేసిన పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


