యూరియా సాధనలో ప్రభుత్వం విఫలం
పాల్వంచ: రైతాంగానికి కావాల్సిన యూరియా కొరత కేంద్రం సృష్టిస్తే, కేంద్రంపై పోరాడి సరిపడా యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారిలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటీకి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆయిల్ సంపదను దోపిడీ చేసే లక్ష్యంతోనే వెనుజువెలాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడికి పాల్పడ్డారని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. తనను మోదీ కూడా సంతోష పెట్టలేదని ట్రంప్ పరోక్ష బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయినా ప్రధాని మోదీ స్పందించలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్లు కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు కేజీ రామచంద్రన్, కె.రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, చిన్న చంద్రన్న, ముద్ద భిక్షం, కల్పన, రాము, రాజు, కృష్ణ పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
అశ్వారావుపేటరూరల్: గిరిజన బాలికను గర్భవతిని చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల లోపు గిరిజన బాలిక గత దసరా పండుగ సెలవులకు ఇదే మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు ఎం.అరవింద్ బాలికను మాయమాటలతో పరిచయం చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండలం సులానగర్కు చెందిన చిలకబత్తిని రవి (42) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన గనమల్ల భిక్షం తీవ్రంగా గాయపడ్డాడు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వారం రోజులు అక్కడే పనిచేసి శనివారం బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో సమ్మక్క గద్దెల సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలై రవి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయాలైన భిక్షంను సీఐ టి.సురేష్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు


