యూరియా కొరత లేదు
జూలూరుపాడు: జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా, ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబూరావు తెలిపారు. సోమవారం పీఏసీఎస్లో తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల స్టాక్ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి యూరియా పంపిణీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజువారీగా సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రస్తుతం 565 యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని వివరించారు. వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఎకరాకు ఒక బ్యాగ్ యూరియా చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్, ఏఈఓలు గౌస్, గోపికృష్ణ, ప్రసాద్, విజయభాను,సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
దాడి ఘటనలో కేసు నమోదు
ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ సీత్లాతండా గ్రామంలో భూవివాదంలో ఆడపడుచులు, అత్తమామలు తనపై దాడిచేసి గాయపర్చారని భూక్య అశ్విని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను కోల్పోయిన తాను అత్తమామల వద్దే ఉంటున్నానని ఫిర్యాదులో పేర్కొంది. గ్రామపెద్దల సమక్షంలో నిర్వహించిన భూమి, అప్పులకు సంబంధించిన వ్యవహారంలో తనపై కోపంతో భౌతికంగా దాడిచేశారని వివరించింది. ఈ మేరకు ఆడపడుచులు జ్యోతి, రోజా, అత్తమామలు భూక్య భారతి, గన్నాలపై కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్సై నాగుల్మీరా తెలిపారు.
దుకాణం యజమానిపై ..
ఇల్లెందు: బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న జగదాంబా గుంపులోని ఎంఆర్ మోటార్స్ దుకాణం యజమాని ఎస్కే రబ్బానీపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సుభాష్నగర్లో ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు తనిఖీలు చేపట్టారు. ఎంఆర్ మోటార్స్ షాపులో ఓ బాలుడు పనిచేస్తుండగా గుర్తించి, యజమానిపై కేసు పెట్టారు.
పందెంరాయుళ్ల అరెస్ట్
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామ శివారు వద్ద కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లు, ఐదు కోడి కత్తులు, కోడి పుంజు, రూ.6,600 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణ్ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
ఇల్లెందు: బుగ్గవాగు నుంచి పోలంపల్లి వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ రోడ్లోని సింగరేణి చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు ట్రాక్టర్ను పట్టకుని స్టేషన్కు తరలించారు. డ్రైవర్ పొదెం ప్రసాద్పై కేసు నమోదు చేశారు.
ప్రజాప్రతినిధిపై దాడి!
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి తన బంధువుల ఇంటికి వెళుతున్న అతడిని కొందరు యువకులు అడ్డుకుని దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయమై సీఐ టి.సురేష్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
మహిళ అదృశ్యం
ఇల్లెందు: పట్టణంలోని కోర్టు ఏరియాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అదృశ్యం కాగా, సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం కోర్టు ఏరియాకు చెందిన సతీష్ కారు డ్రైవింగ్ కోసం లింగాల వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య శిల్పశ్రీ తన కుమారుడితో కలిసి ఇంట్టి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు.
డిగ్రీ విద్యార్థిని..
ఇల్లెందు: డిగ్రీ విద్యార్థిని అదృశ్యంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ ఏరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి మోహన్ కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ నెల 2న ఇంటి నుంచి దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో సీఐ సురేష్ కేసు నమోదు చేశారు.
మందుపాతర పేలి బాలుడికి తీవ్ర గాయాలు
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మందుపాతర పేలి ఓ బాలుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాలుడు రాము పోతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లేండ్రా– కోర్చోలి అడవి నుంచి నడిచి వెళ్తున్నాడు. పోలీసు బలగాలను మట్టుబెట్టే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెజర్ బాంబుపై కాలు వేయడంతో అది పేలి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలుడికి సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.


