
స్థానిక పోరుకు
అక్టోబర్ 23, 27న పరిషత్లకు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతల్లో పోలింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో.. జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులు
సై..
11 మండలాల చొప్పున..
జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలు, వాటి పరిధిలోని 113 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో అశ్వాపురం మండలంలో 12, భద్రాచలంలో14, బూర్గంపాడులో 17, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, కరకగూడెంలో 5, మణుగూరులో 11, పినపాకలో 9, ఆళ్లపల్లిలో 5, గుండాలలో 5, జూలూరుపాడు మండలంలోని 10.. మొత్తం 113 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మలి విడత అక్టోబర్ 27న చుంచుపల్లి మండలంలోని 12, లక్ష్మీదేవిపల్లిలో 11, సుజాతనగర్లో 5, పాల్వంచలో 10, దమ్మపేటలో 17, అశ్వారావుపేటలో 11, ములకలపల్లిలో 10, చండ్రుగొండలో 8, అన్నపురెడ్డిపల్లిలో 6, టేకులపల్లిలో 14, ఇల్లెందు మండలంలోని 16.. మొత్తం 120 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ స్థానాలకు తొలి, మలి విడతల్లో 11 స్థానాల చొప్పున ఎన్నికలు ఉంటాయి. కాగా, జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితాలు, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇప్పటికే రెండు విడతలుగా ఆర్ఓలు, ఏఆర్ఓలకు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఇక జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డు స్థానాలు ఉండగా అక్టోబర్ 31న అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 జీపీలు, 1,436 వార్డులకు, నవంబర్ 4 అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 జీపీలు, 1,392 వార్డులకు 8వ తేదీన ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతననగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని 156 పంచాయతీలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్పంచ్లకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్ర పర్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 10,223 మంది, పరిషత్ ఎన్నికలకు 8,711 మంది సిబ్బందిని కేటాయించారు. పంచాయతీలకు 4,242, పరిషత్ ఎన్నికలకు 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కాగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది నియామకం, మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో రాజకీయ సందడి ప్రారంభమైంది. – చుంచుపల్లి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. పంచాయతీల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలను మాత్రం నవంబర్ 11న ప్రకటిస్తారు. పరిషత్ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9న, రెండో విడత నోటిఫికేషన్ను 13న విడుదల చేసి, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పంచాయతీలకు తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 17న, రెండో విడత నోటిఫికేషన్ 21న, మూడో విడత నోటిఫికేషన్ 25న విడుదల చేసి అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపడతారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలను అందుబాటులో ఉంచారు. షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొనగా.. ఆశావహులు బరిలో నిలిచేందుకు ప్రయత్నాల్లో మునిగిపోయారు. రిజర్వేషన్లు అనుకూలించని చోట కొందరు నైరాశ్యంలో ఉన్నారు.
మోగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల నగారా

స్థానిక పోరుకు