
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించాక మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
22 మంది మైనింగ్ అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 22 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఈఈ సెల్ హెచ్ఓడీ మురళీధర్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది డీజీఎంలు, ఒక ఎస్ఓఎం, ఆరుగురు అడిషినల్ మేనేజర్లు, ఒక డిప్యూటీ మేనేజర్, ఇద్దరు ఎస్ఈలు, ఇద్దరు డీవైఎస్ఈలు, ఒక సీనియర్ అండర్ మేనేజర్ ఉన్నారని వివరించారు. వీరంతా ఈనెల 28వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించారు.
27 వరకు దరఖాస్తుల స్వీకరణ
కొత్తగూడెంఅర్బన్: సహాయ ఉపకరణాల కోసం జిల్లాలోని అర్హులైన దివ్యాంగుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఇందుకు ఈనెల 27 వరకు గడువు ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిట్రో ఫిట్టెడ్ మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో హైబ్రిడ్ వీల్ చైర్, ల్యాప్టాప్లు, 5జీ స్మార్ట్ ఫోన్, ట్రై సైకిల్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. దరఖాస్తు కాపీలను తమ కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 63019 81960, 83310 06010 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రెండో రోజు టీజీ టెట్ ప్రశాంతం
సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు గురువారం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మందికిగాను మొదటి షిఫ్ట్లో 93 మంది, రెండో షిఫ్ట్లోనూ 93 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
నేడు, రేపు జాతీయ సదస్సు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ జూనియర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ తదితర విభాగాల ఆధ్వర్యాన శతజయంతి సాహితీమూర్తులు దాశరథి, ఆరుద్ర జీవితం, సాహిత్యంపై ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. కళాశాల విద్యా కమిషనర్ ఎ.శ్రీదేవసేనతో పాటు పలువురు కవులు, కళాకారులు హాజరవుతారని తెలిపారు.

సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం