
‘చేయూత’కు ఆకర్షితులవుతున్నారు..
సూపర్బజార్(కొత్తగూడెం): ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం 12 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వీరిలో ముగ్గురు డీవీసీఎంలు, 17 మంది ఏసీఎంలు, 34 మంది పీఎంలు, 107 మంది మిలీషియా సభ్యులు, 35 మంది ఆర్పీసీలతో పాటు మరో 98 మంది వివిధ స్థాయిల్లో పనిచేసిన వారు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ – ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారని, సరిహద్దు గ్రామాల ప్రజలు వారికి సహకరించొద్దని కోరారు. లొంగిపోవాలనుకున్న మావోలు స్థానిక పోలీస్స్టేషన్లలో బంధువుల ద్వారా సంప్రదించాలని సూచించారు. గురువారం లొంగిపోయిన 12 మంది మావోయిస్టులకు మొదట రూ.25 వేల చొప్పున నగదు అందజేశారు. వారి హోదాను బట్టి అందించే మిగతా సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేష్కుమార్ సింగ్, 141 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ప్రతాప్ పుర్తి, చర్ల సీఐ రాజువర్మ, ఆర్ఐ రవి పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్రాజు వెల్లడి
12 మంది మావోయిస్టుల లొంగుబాటు