
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలం: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ముందస్తు జాగ్రత్తలను పాటించాలని చెప్పారు. సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని, 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. చర్ల, దుమ్ముగూడెం, సింగరేణి, కారేపల్లి మండలాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, ఆయా మండలాల్లో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పాటించాలని, డెంగ్యూ నిర్ధారణ కేసులు నమోదైన గ్రామంలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలని సూచించారు. వైద్యాధికారులు చైతన్య, రామకృష్ణ, జయలక్ష్మి, మధువరన్, పుల్లారెడ్డి, తేజ శ్రీ పాల్గొన్నారు.
మెరిట్ విద్యార్థులకు అభినందనలు
గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల్లో చదివి జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్లలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పీఓ అభినందించారు. శుక్రవారం విద్యార్థులు పీఓ రాహుల్ను ఆయన చాంబర్లో కలవగా వారిని శాలువాతో సత్కరించారు.ఉన్నత విద్యలో సైతం ఇదే విధంగా ప్రతిభ చాటాలని సూచించారు. గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, బాలస్వామి, పద్మావతి, రమేష్, నరసింహారావు, శ్రీనివాస్, సత్యనారాయణ, రమేష్ , హరీష్, కేశవరావు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్